పెద్ద అంబర్పేట, మార్చి 4: పనిచేస్తున్న చోటే నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని రామోజీ ఫిలిం సిటీలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్ కుంట్లూరుకు చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్కు పదేండ్ల కిందట సాయికుమారి (34) తో పెండ్లి జరిగింది.
వీరికి ఇద్దరు పిల్లలు. సాయికుమారి తొమ్మిదేండ్లుగా రామోజీ ఫిలిం సిటీలోని కాల్సెంటర్లో ఉద్యోగం చేస్తున్నది. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 6 గంటల షిఫ్ట్లో పనిచేసేందుకు రామోజీ ఫిలిం సిటీకి సంస్థకు చెందిన బస్సులో వెళ్లింది. ఈనాడు భవనంలోని నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి చనిపోయింది. హెచ్ఆర్ విభాగం నుంచి వచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్నానని..సాయికుమారి చనిపోయి కనిపించిందని ఆమె భర్త శ్రీనివాస్ తెలిపారు.
రెండ్రోజులుగా ఆఫీసులో పని ఒత్తిడి పెరిగిందని సాయికుమారి తెలిపినట్టుగా ఆయన చెప్పారు. ధైర్యంగా ఉండాలని చెప్పి.. ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లి వచ్చామని, ఇంతలోనే ఇలా జరిగిందని వాపోయారు. భార్య చావుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు తెలిపారు.