ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 19: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి నానాటికి తీసి కట్టుగా తయారవుతోందని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి మండిపడ్డారు. తక్షణమే వాటిని సంస్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో పరిస్థితులకు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.
గురుకులాలు, కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ ఘటనల కారణంగా ఇప్పటికే ముగ్గురు చనిపోయారని, మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్రంలో విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించి, విద్య రంగాన్ని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. వర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించడంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.