ఖైరతాబాద్, సెప్టెంబర్ 6 : గణేశ్ నిమజ్జన వేడుకల్లో విద్యార్థుల మధ్యన మొదలైన చిన్నపాటి గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్డికాపూల్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండలోని న్యూ రామారావునగర్కాలనీలో నివాసముండే పొదిల లక్ష్మణ్ పెద్ద కొడుకు పి.సాయిచరణ్ (19) లక్డీకాపూల్లోని ఐఐఎంసీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు.
అతడి స్నేహితుడు ఫోన్ చేసి విద్యార్థులం అందరం కలిసి గణేశ్ నిమజ్జనం నిర్వహిస్తున్నామని, రావాలని కోరాడు. దీంతో సాయిచరణ్ అక్కడికి వెళ్లిన అనంతరం అదే కళాశాలకు చెందిన విద్యార్థులు వినయ్, ఆకాశ్, సంజయ్లతో గొడవ జరిగింది. వీరిమధ్యన మాటమాట పెరుగడంతో సాయిచరణ్ కడుపులో కత్తితో పొడిచారు. గమనించిన తోటి స్నేహితులు సాయిచరణ్ను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సాయిచరణ్ తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.