బంజారాహిల్స్, అక్టోబర్ 25: బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో బుధవారం ఏం జరుగనున్నదనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ వ్యవహారంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి చెందిన డీఏవీ స్కూల్ యాజమాన్యం, ప్రతినిధులు బుధవారం వస్తున్నట్లు తెలిసింది. వారితో కలిసి మరోసారి విద్యాశాఖ అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఈ సమస్యకు ముగింపు పలకాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో బుధవారం కీలకంగా మారనున్నది. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు బుధవారం తమ పిల్లలతో కలిసి స్కూల్ వద్దకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
డీఏవీ పబ్లిక్ స్కూల్ను ప్రభుత్వ పర్యవేక్షణలో నడిపించాలి
విద్యాశాఖ మంత్రికి విద్యార్థి సంఘాల నాయకుల వినతి
బంజారాహిల్స్, అక్టోబర్ 25: బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పలు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. స్కూల్ గుర్తింపు రద్దు చేయడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వ పర్యవేక్షణలో స్కూల్ను నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి కె.అశోక్రెడ్డి, ఐద్వా కార్యదర్శి కె. నాగలక్ష్మి, డీవైఎఫ్ఐ కార్యదర్శి ఎండీ.జావెద్ తదితరులు ఉన్నారు.
బంజారాహిల్స్ పోలీసుల పిటిషన్పై నేడు వాదనలు
బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు రజినీకుమార్తో పాటు ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవిని ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం వాదనలు జరగనున్నాయి. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాధవి పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కస్టడీ పిటిషన్పై నిర్ణయం తీసుకున్న తర్వాతే మాధవి బెయిల్పై విచారణ ఉంటుందని అధికారులు తెలిపారు.