బడంగ్పేట : కళాశాలలో, విద్యా సంస్థలలో డ్రగ్స్ వాడిన వారిపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారిచేశారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్, షీటీమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా జెడ్సీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మంత్రి విద్యార్థులతో ప్రమాణం చేయించారు. హైదరాబాద్ బెస్టు సీటీగా, సేఫ్ సిటీగా పేరు ప్రతిష్టలు వచ్చాయని ఆమె అన్నారు.
అలాంటి నగరంలో డ్రగ్స్ లాంటి దురాలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. విద్యార్థులు కష్ట పడి చదువుకొని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. కష్ట పడి చదువుకోవడం కాకుండా ఇష్ట పడి చదువుకోవాలని ఆమె అన్నారు. ఇంజనీరింగ్ విద్యకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా మారిందన్నారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే విద్యార్థులు చెడు మార్గాలను ఎంచుకోవడం బాధకరమాన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇంగ్లీష్ విద్యను అందిస్తుందన్నారు.ప్రపంచంతో తెలంగాణ విద్యార్థి పోటి పడాలన్నదే రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు.
గతంలో అమ్మాయిలు చదువుకు దూరంగా ఉండే వారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో అమ్మాయిలలో అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారిలో యూనివర్సిటీలలో 70శాతం అమ్మాయిలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. గణనీయంగా పెరుగుతున్న బాలికల చదువును తెలుసుకున్న ముఖ్య మంత్రి అమ్మాయిల కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, డీసీపీ సీటీమ్ సలీమా, ఎసీపీ హరినాథ్, సతీష్, లత రామ సుబ్రమణ్యం, సావిత్రి, అర్చన, శివ, తదితరులు ఉన్నారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు.