వెంగళరావునగర్, డిసెంబర్ 6 : విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ముగ్గురు కీచకులు రాక్షసత్వానికి ఒడిగట్టారు. ఈ దారుణం సనత్నగర్ పరిధిలో జరిగింది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తమ కుటుంబంతో కలిసి ఉంటున్నది. ఎస్ఆర్నగర్లోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నది. బాలిక అక్క గత ఫిబ్రవరిలో సాయి అనే వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుని.. ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలికపై సాయి స్నేహితుడు కన్నేశాడు. గత నెల 25వ తేదీ ఉదయం ఆ బాలిక ఇంటి నుంచి పాల ప్యాకెట్ కోసం కిరాణా దుకాణం వెళ్లింది.
ఆ సమయంలో తన బావ మిత్రుడైన ఆ యువకుడు చూసి.. వెంటనే ఈల వేశాడు. అప్పటికే అక్కడ నిలిపి ఉంచిన కారులో బాలికను కిడ్నాప్ చేసి.. బొబ్బుగూడ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ కారును ఆపి.. బాలికపై బావ మిత్రుడైన ఆ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికకు రక్తస్రావమైనప్పటికీ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికైనా ఈ విషయం చెబితే.. మీ అక్కను చంపేస్తామని బాలికను బెదిరించారు. బాధితురాలు జరిగిన ఘోరాన్ని తండ్రితో చెప్పలేకపోయింది. తల్లి గుంటూరుకు వెళ్లింది. తండ్రితో కలిసి అక్కడికి వెళ్లిన బాలిక.. జరిగిన ఘోరాన్ని తల్లితో చెప్పింది. తల్లితో కలిసి ఆ బాలిక ఈ నెల 5వ తేదీన మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నేరం జరిగిన ప్రదేశం సనత్నగర్ పీఎస్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.