బంజారాహిల్స్,ఏప్రిల్ 24 : వేసవి సెలవులు బంధువుల ఇంట్లో గడుపుదామని బయలుదేరిన బాలిక రోడ్డు ప్రమాదంలో(Road accident) దుర్మరణం పాలయింది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న గురవయ్య కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె శిరీష(15) శ్రీ సాయిరామ్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది.
కాగా శిరీష చిన్నమ్మ కళ్యాణి కుటుంబం ఫిలింనగర్లో నివాసం ఉంటారు. భర్తతో కలిసి కళ్యాణి సొంతూరైన ఖమ్మం వెళ్లగా ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. పరీక్షలు పూర్తవడంతో పాటు వేసవి సెలవుల్లో భాగంగా వారంరోజులు చిన్నమ్మ ఇంట్లో ఉండి రావాలని శిరీష భావించింది. దీంతో కళ్యాణి కొడుకు (14)కు ఫోన్ చేయగా మంగళవారం రాత్రి బైక్ మీద శిరీషను ఎక్కించుకుని ఫిలింనగర్కు బయలుదేరాడు.
యూసుఫ్గూడ(Yusupguda) మెట్రోస్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సును(RTC bus) ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో బైక్ ప్రమాదానికి గురయింది. బైక్ వెనకాల కూర్చున్న శిరీష కిందపడిపోయింది. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.