Malla Reddy University | మేడ్చల్, మార్చి 18 : అన్యాయంగా తమను డిటైండ్ చేసి.. తమ బతుకులతో చెలగాటం ఆడుతున్నారని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కోర్సు చేస్తున్న విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. తమను కావాలనే డిటైండ్ చేసి తృతీయ సంవత్సరంలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యూనివర్సిటీకి చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని, విద్యార్థులకు మద్ధతుగా నిలిచారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు యూనివర్సిటీకి చేరుకొని, విద్యార్థులకు మద్ధతుగా నిలవడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కావాలనే 70 మందిని డిటైండ్ చేశారని, సప్లిమెంటరీ పరీక్షల్లో 20 మందిని ఫెయిల్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల ఎదుటు మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు.
దుండిగల్, మార్చి 18 : తమ విద్యాసంస్థలు, సేవలపై కావాలనే కొందరు బురదజల్లుతున్నారని మల్లారెడ్డి హెల్త్సిటీ సీఎండీ డా.భద్రారెడ్డి, ఎండీ డా.ప్రీతిరెడ్డి, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సూరారంలోని మల్లారెడ్డి వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులు ద్వితీయ సంవత్సరం నుంచి తృతీయ సంవత్సరానికి వెళ్లాలంటే మొదటి సంవత్సరం పాస్ కావాల్సి ఉంటుందని తెలిపారు. కావాలనే కొంతమంది ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం మైసమ్మగూడలోని యూనివర్సిటీలోకి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావు ప్రవేశించి సిబ్బందిని దుర్బాషలాడటంతో పాటు ఫర్నిచర్ను ధ్వంసం చేశారని, విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని తెలిపారు. గడిచిన 35 ఏండ్లుగా తాము విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ ప్లేస్మెంట్లను అందిస్తున్నట్లు తెలిపారు. 2వేల మంది విద్యార్థులు అగ్రికల్చర్ విద్యను చదువుతుండగా కేవలం 22మంది మాత్రమే డిటెండ్ అయ్యారని, ఐదు సార్లు అవకాశం కల్పించినప్పటికీ ఉత్తీర్ణులు కాకపోవడంతోనే డిటెండ్ అయినట్లు స్పష్టం చేశారు. దీన్ని అదనుగా భావించిన మైనంపల్లి హన్మంతరావు 100మందిని తమ యూనివర్సిటీ క్యాంపస్లోకి పంపి హంగామా సృష్టించడంతో పాటు తన తండ్రి, మాజీ మంత్రి మల్లారెడ్డి ఫొటోను దగ్ధం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చదవకున్నా పాస్ చేస్తే బయటికి వెళ్లిన విద్యార్థులు సమాజానికి ఎలా సేవలు అందిస్తారని ప్రశ్నించారు.
కుత్బుల్లాపూర్, మార్చి 18 : మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీపై సోమవారం కొంతమంది వ్యక్తులు చేసిన దాడిపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 24మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు.