Jalamandali | సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : వాటర్ ట్యాంకర్ల సరఫరాలో అక్రమాలకు చెక్ పెడుతూ జలమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. గాడి తప్పుతున్న ట్యాంకర్ను ట్రాకింగ్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. వినియోగదారుడికి అత్యంత పారదర్శకంగా ట్యాంకర్ నీటిని చేర్చేలా ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ప్రస్తుతం వాటర్ ట్యాంకర్కు యమ డిమాండ్ ఉన్నది. ఇదే అదునుగా కొందరు ట్యాంకర్ నీటిని పక్కదారికి మళ్లిస్తూ అక్రమ దందాకు తెరలేపారు.
ఈ నేపథ్యంలో రియల్ టైం ట్రాకింగ్ విధానాన్ని అమలు చేసి వాటర్ ట్యాంకర్ నీటిని సక్రమంగా అందించే చర్యలకు జలమండలి ఉపక్రమించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రాబోయే వారం రోజుల్లోగా 75 ఫిల్లింగ్ స్టేషన్లలో సైతం ట్రాకింగ్లోకి వాటర్ ట్యాంకర్లను తీసుకొస్తామని ఐటీ విభాగం అధికారులు తెలిపారు. సంస్థ పరిధిలో ఉన్న 700 ట్యాంకర్లను ట్రాకింగ్లోకి తీసుకొచ్చి ఉబర్, ఓలా తరహాలో వాహనం ఏ సమయంలో ఎక్కడ ఉంది? ఎంతసేపటిలో ట్యాంకర్ ఇంటికి చేరుతుందో వినియోగదారులు తెలుసుకునేలా పారదర్శక సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.