సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మెట్రో పిల్లర్లపై రాజకీయ పోస్టర్లు అంటిస్తే కఠిన చర్యలు ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై సెంట్రల్ మెట్రో నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే ఆరు నెలలు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ఎల్అండ్టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా మెట్రో, సువిధ మొబైలిటీ మరో మైలురాయి దాటిందని తెలిపారు.
2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫీడర్ ట్రాన్స్పోర్టేషన్ సాయంతో ఇప్పటివరకు 10లక్షల మంది గమ్యస్థానాలకు చేరుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా వేడుకలను నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. మెట్రో సేవలను మరింత విస్తృత పరచడంలో సువిధ కీలకపాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. సువిధ మొబిలిటీ, ఎల్అండ్టీ మధ్య ఎంఓయూ జరిగిందని తెలిపారు. సిటీలోని ప్రధాన మెట్రో స్టేషన్ల నుంచి ప్రతిరోజు 8వేల మంది రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. కొవిడ్ సమయంలోనూ సేవలు అందించామని సువిధ ఫౌండర్ సిద్ధార్థ్ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్టీ ప్రతినిధులు, సువిధ డైరెక్టర్ జిగ్నేష్ బెల్లాని, తదితరులు పాల్గొన్నారు.