New Year | కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 30 : న్యూ ఇయర్ వేడుకల్లో సరదాకోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని, మద్యం సేవించి, ఓవర్ స్పీడ్, రాంగ్రూట్లో డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలను నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలుంటాయని మేడ్చల్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణు గోపాల్రెడ్డి అన్నారు. శనివారం కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషనల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఆదివారం రాత్రి 10 నుంచి 5 గంటల వరకు నెహ్రూ ఔటర్ రింగ్రోడ్డు మీదుగా విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు అనుమతి లేదని, కేవలం విమాన టికెట్ చూపించిన వారికే అనుమతి ఉంటుందన్నారు.
శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, షేక్పేట్ ఫ్లైఓవర్, మౌండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్డు నం.55 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరంమాల్ జేఎన్టీయూచ్ ఫ్లైఓవర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, బాలానగర్ (బాబూ జగ్జీవన్రామ్) ఫ్లైఓవర్ లను పూర్తిగా మూసివేయడం జరుగుతుందన్నారు. క్యాబ్లు, ట్యాక్సీ, ఆటోరిక్షా ఆపరేటర్లు కచ్చితంగా యూనీఫామ్లు ధరించాలని.. వాహనాలకు సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని, ప్రజలతో అనుచితంగా ప్రవర్తించవద్దని, అదనపు చార్జీలు డిమాం డ్ చేయొద్దన్నారు. పబ్బులు, బార్లు, క్లబ్లు నిబంధనలు కచ్చితంగా పాటించా లన్నారు.
సాధారణ ప్రజలు ఓవర్ స్పీడ్, రాంగ్రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవిం గ్, హెల్మెట్ లేకుండా బైక్, సీటు బెల్టు లేకుండా కార్లు నడిపితే చర్యలుంటాయని తెలిపారు. వాహనాల్లో అధిక డెసిబుల్ సౌండ్ సిస్టమ్ ఉపయోగించడం తగదని, మైనర్లు వాహనాలు నడపొద్దని కోరారు. కొత్త సంవత్సరం పేరుతో ఒక్కరోజు సరదా కోసం విలువైన ప్రాణాలు కోల్పోవద్దని కోరారు. యువత.. సంతోషం కోసం తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలించొద్దన్నారు. నేడు రాత్రి విస్తృతంగా తనిఖీలు ఉంటాయని పట్టుబడితే మోటార్ వెహికిల్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు, జైలు శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అందరూ బాధ్యతగా సహకరించి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య, సీఐలు నాగేశ్, నర్సింహారావు, పవన్కుమార్, కిరణ్కుమార్, ఎస్.శేఖర్, తదితరులు పాల్గొన్నారు.