గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారానికి క్రమంగా అడ్డుకట్ట పడుతున్నది.కుక్కల బెడదలేని నగరంగా మార్చేందుకుగానూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూనే, రేబిస్ నివారణ టీకాలు వేస్తున్నారు. గడిచిన ఆరేండ్లుగా ప్రతి వీధి కుక్కకు కుటుంబ నియంత్రణ చేయడానికి వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే గ్రేటర్లో వీధి కుక్కలను తేల్చే టాస్క్ను బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్కు జీహెచ్ఎంసీ అప్పగించింది. జీహెచ్ఎంసీ ఆవిర్భావ సమయంలో 7.50 లక్షల వీధి కుక్కలు ఉండగా ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో మొత్తం 4 లక్షల 61,055 వీధి కుక్కలు ఉన్నట్లు తాజాగా తేల్చారు. మొత్తంగా 43శాతం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రెండున్నర లక్షల కుక్కలకు చేయాల్సి ఉందన్నారు. జోన్ల వారీగా పలు ఏజెన్సీలకు ఈ బాధ్యతలు అప్పగించారు.
గ్రేటర్ పరిధిలో కుక్క కాటు కేసులు 28 శాతం వరకు తగ్గాయని బ్లూ క్రాస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2019లో 38,958 కుక్క కాటు కేసులు నమోదు కాగా, 2020లో 27,926 కేసులే నమోదయ్యాయని, 2019తో పోల్చితే 28 శాతం తగ్గిందని తెలిపారు. ఇదంతా వీధి కుక్కలకు రేబిన్ టీకాలు వేయడం ద్వారా సాధ్యమైంది.నగరంలోని ఐదు సెంటర్లలో కుక్కల సంతతి నియంత్రణ ఆపరేషన్లు,రేబిస్ టీకాలు వేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీనగర్ జోన్లోని ఫతుల్లగూడ, చార్మినార్ జోన్లోని చూడీబజార్, ఖైరతాబాద్లోని పటేల్నగర్, శేరిలింగంపల్లి జోన్లో కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, సికింద్రాబాద్ జోన్లకు కలిపి మహదేవ్పూర్లో యానిమల్ కేర్ సెంటర్లుకొనసాగుతున్నాయి. వీధి కుక్కలను పట్టుకొని ఈ సెంటర్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటీ రేబి స్ టీకాలు వేస్తున్నారు. ఐదు జోన్లలో కలిపి ప్రతి రోజూ 274 కుక్కలకు టీకాలు వేస్తున్నారు. కుక్కలను పట్టుకునేందుకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు.