హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బహుముఖ వ్యూహంతో నగరంలో నాడు గంటల్లో సాగిన ప్రయాణం నేడు నిమిషాల్లోనే ముగుస్తున్నది. కాలంతో పోటీ పడి ప్రయాణించేలా.. సాఫీ సాగియేలా నగర దారులను ప్రగతికి సోపానాలుగా మార్చేశారు. దేశంలోని ఏ ఇతర నగరాల్లో చేపట్టని విధంగా, నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు చేపడుతున్న ఎస్సార్డీపీలో మొదటి దశలో 47 ప్రాజెక్టులకు గాను 33 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తరుణంలో అంతే వేగంగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మాణాలు చేపట్టారు.
వ్యూహాత్మకదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు దాదాపు రూ.4,357.85కోట్లతో 33 చోట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. 17 ఫల్లు ఓవర్లు, 5 అండర్పాస్లు, ఏడు ఆర్వోబీ/ఆర్యూబీలు, స్టీల్ బ్రిడ్జి, ఒక కేబుల్ బ్రిడ్జిలు, విస్తరణ బ్రిడ్జి ఒకటి, ఓఆర్ఆర్ నుంచి మెదక్ జంక్షన్ వరకు ప్రాజెక్టులు రావడంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. ప్రయాణం సాఫీగా జరగడంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుంది. ఎస్సార్డీపీ ఫలితాలను చూసి రాష్ర్టానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, ఇతర దేశాల ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు.
– సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)