సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వీధి కుక్కల సంఖ్య పెరుగుదల నియంత్రణకు సమగ్ర ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూనే, రేబిస్ నివారణ టీకాలు వేస్తున్నారు. గడిచిన కొన్నేండ్లుగా ప్రతి వీధి కుక్కకు స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే జోన్ల వారీగా ఐదు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించిన అధికారులు వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 4 లక్షల 61 వేల వీధి కుక్కలు ఉండగా..దాదాపు మూడున్నర లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్తో పాటు రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని.. యాంటీ రేబిస్ వ్యాక్సిన్పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
నిబంధనల ప్రకారం…
దేశవ్యాప్తంగా నగరాలు,పట్టణాల్లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఏడబ్ల్యూబీఐ) నిబంధనలకు లోబడి యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ), యాంటీ రేబిస్(ఏఆర్) కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జోన్కి ఒకరు చొప్పున వెటర్నరీ డాక్టర్లు ఉండగా, ప్రైవేటు డాక్టర్ల ఆధ్వర్యంలో ఐదు ఎనిమల్ కేర్ సెంటర్లు ఫతుల్లాగూడ, చుడిబజార్, పటేల్నగర్, కేపీహెచ్బీ కాలనీ, మహదేవ్పూర్లో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ముందుగా కుక్కలను పట్టుకొని వాటికి స్టెరిలైజేషన్ చేశాక నాలుగైదు రోజులపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అనంతరం వాటిని ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలివేయడం ఆనవాయితీ. శస్త్రచికిత్స నిర్వహించిన కుక్కల కుడి చెవికి వీ ఆకారంలో మార్క్ వేసిన తరువాత వదిలివేస్తారు.