కొండాపూర్, జూన్ 27 : డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సర్వే చేయనున్నట్లు చందానగర్ సర్కిల్ -21 ఉపకమిషనర్ నందగిరి సుధాంశ్ మంగళవారం తెలిపారు. సర్కిల్ పరిధిలో డబుల్ బెడ్ రూంలకు 8389 దరఖాస్తులు వచ్చాయన్నారు. బుధవారం నుంచి దరఖాస్తులను పరిశీలించి, ఆ తర్వాత సర్వే చేయనున్నట్లు తెలిపారు. గతంలో యాప్ ద్వారా ఓటర్ కార్డు, సెల్ఫోన్ నంబర్లు సేకరించామని, ఆ వివరాల ప్రకారం దరఖాస్తు పత్రాలతో సర్వే చేస్తామన్నారు. డబుల్ ఇండ్లను అర్హులైన వారికే కేటాయించేలా సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
మొత్తం 14 బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతి బృందంలో ఒక బిల్ కలెక్టర్, ఒక మండల రెవెన్యూ సిబ్బంది ఉంటారన్నారు. మొత్తం దరఖాస్తులను 15 రోజుల్లో పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. కాగా కేటాయించిన డబుల్ ఇండ్లలో రిజర్వేషన్ల ప్రకారం 17 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 12 శాతం మైనార్టీలకు, మిగతా 65శాతం ఇతరులకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఒకే నియోజకవర్గంలో ఆధార్, ఓటరు కార్డులుండి, 2018 సంవత్సరానికి ముందుగా నియోజకవర్గంలో ఓటర్కార్డు ఉండి, రేషన్కార్డులుండాలన్నారు. భార్య, భర్తల పేర్ల మీద పక్కా ఇల్లుంటే, ఇది వరకే 58, 59 జీవోలలో పట్టాలు పొందిన వారు అనర్హులని తెలిపారు.