సిటీబ్యూరో, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలకు పాల్పడే వారికి శిక్షలు పడేవిధంగా దర్యాప్తు సాగాలని, అందరూ నైపుణ్యాన్ని పెంపొందించుకొని, రోబోస్ట్ మెకానిజమ్తో మానిటర్ చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శుక్రవారం సైబర్క్రైమ్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లకు భయం పుట్టే విధంగా దర్యాప్తు ఉండాలన్నారు. రానున్న రోజుల్లో చాలా నేరాలు సైబర్కు సంబంధించినవే ఉంటాయన్నారు. ఇన్విస్టిగేషన్ ఆపరేషన్ సెంటర్ సైబర్ క్రైమ్స్పై విశ్లేషణ చేసి దర్యాప్తు అధికారులకు ఆధారాలు అందించాలన్నారు. ఇన్విస్టిగేషన్ సపోర్టు సెంటర్ నుంచి సైబర్క్రైమ్ దర్యాప్తునకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్(ఎస్ఓపీ)ని అందించి నేరాలను ఛేదించేలా తోడ్పాటునందించాలన్నారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ రోహిని ప్రియదర్శిని, డీసీపీ లావణ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.