సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): సన్పరివార్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీతో సమావేశమయ్యారు. గొలుసు కట్ట విధానంలో దాదాపు 1200 మంది నుంచి రూ. 158 కోట్లకుపైగా వసూలు చేసిన మెతుకు రవీందర్, మరికొందరు భారీ మోసానికి పాల్పడటంతో శామీర్పేట పోలీస్స్టేషన్లో నిందితులపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ చేపట్టిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేసి బాధితులకు తగిన నిష్పత్తిలో పంపిణీ చేయాలని, సైబరాబాద్ కమిషనర్ నేతృత్వంలో వివిధ విభాగాల అధికారులతో కమిటీ వేసి 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ, న్యాయ, రోడ్డు ట్రాన్స్పోర్టు, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీతో సీపీ సమావేశాన్ని నిర్వహించారు. స్థిర, చరాస్తుల వేలం వేసే విధానంపై చర్చించారు. ఈ అక్షన్ ద్వారా వేలం వేస్తూ పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని నిర్ణయించారు.