అమీర్పేట్, ఫిబ్రవరి 15 : ప్రశాంతమైన జీవనం యోగాతోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు కూడా యోగను ఆచరిస్తున్నాయన్నారు. శ్రీ రామచంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగ ఫర్ యూ, హార్ట్ఫుల్నెస్ సంస్థల సహకారంతో ఈ నెల 17 నుంచి 19 వరకు ‘హర్ దిల్ ధ్యాన్.. హర్ దిన్ ధ్యాన్’ పేరుతో ఎల్బీ స్టేడియంలో జరుగనున్న యోగా మహోత్సోవ్ పోస్టర్ను బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిందని, ఇందుకు యోగాను చక్కటి సాధనంగా చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం హర్షించదగ్గ విషయమన్నారు. భారతీయ ప్రాచీన ఆరోగ్య విధానాలైన యోగా, ముద్ర, ధ్యాన, ఆయుర్వేదాలకు సంబంధించి యోగా మహోత్సవ్లో తెలుసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అన్ని రంగాల ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా, 17న సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు, 18న ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు, 19న ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. యోగా మహోత్సవ్లో పాల్గొనాలనుకునే వారు http://hfn.link/hdd లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ జోనల్ కోఆర్డినేటర్ డాక్టర్ సాయిరామ్ రెడ్డి, సంజయ్ సెహగల్, బాబు గుర్రం తదితరులు పాల్గొన్నారు.