శేరిలింగంపల్లి, డిసెంబర్ 17: రాబోయే 6 నెలల్లో జీహెచ్ఎంసీ పరిధిలో జోన్ల వారీగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బహ్మకుమారీస్, తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖల సంయుక్త అధ్వర్యంలో ‘ఐ కెన్ డూ ఇట్’ పేరిట రాష్ట్రవ్యాప్త దివ్యాంగుల యాత్ర ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు తాను ముందుంటానని తెలిపారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ డైరెక్టర్ కుల్దీప్ బెహన్ మాట్లాడుతూ దివ్యాంగుల లోపాలను, శరీరాన్ని చూడకుండా వారిలోని నైపుణ్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కృష్ణ, రాజయోగిన మంజు, సూర్యమణి, పారిశ్రామికవేత్త హనుమంతు, బవేష్ బాటియా తదితరులు పాల్గొన్నారు.