సైదాబాద్, సెప్టెంబర్ 4: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హైదరాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు సైదాబాద్ మండల పరిధిలో ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. సైదాబాద్ జీబీపీఎస్ పాఠశాలకు చెందిన ఎన్. నాగలత, కాలడేరా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన టి. హృదయ మేరి, మలక్పేట జీపీఎస్ పాఠశాలకు చెందిన బి. ఉమారాణి, జీబీపీఎస్ కుర్మగూడ పాఠశాల ఉర్దూ ఉపాధ్యాయుడు మహ్మద్ అమ్జాద్ అలీ, మూసారాంబాగ్ జీజీహెచ్ఎస్ పాఠశాల గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు సి. రామాదేవి, జీహెచ్ఎస్ కాచిగూడ స్కూల్ అసిస్టెంట్ కె.అనిత ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నిక ఉత్తమ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావటం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు తాము అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి అవార్డును బహూకరిస్తుండటం అనందాన్ని కల్గిస్తుందన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులను అందుకుంటున్న వారికి పీఆర్టీయూ సైదాబాద్ మండలాధ్యక్షుడు మందడి వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు.