రంగారెడ్డి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): ‘ప్రజలే నా బలం.. పార్టీ క్యాడరే నా బలగం. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలు గుర్తిస్తున్నారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడుతారు. కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడేది సెకండ్ ప్లేస్ కోసమే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కంచుకోట.. ఇక్కడ అన్ని సీట్లు గెలిచి తీరుతాం. తొమ్మిదేండ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధే సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమకు నిదర్శనం. ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ఆధారంగానే ప్రజలను ఓట్లు అడుగుతాం. మరోసారి టిక్కెట్ కేటాయించిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్న మా పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది. రూ.2వేల కోట్లకు పైగా నిధులను వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులతో మహేశ్వరం నియోజకవర్గం ముఖచిత్రమే మారిపోయింది. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా.. అనుక్షణం వాళ్ల మధ్యనే ఉంటున్నానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఫాక్స్కాన్ వంటి కంపెనీల ఏర్పాటు, మెడికల్ కాలేజి, మెట్రో విస్తరణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటి అంశాలు రానున్న ఎన్నికల్లో తన గెలుపునకు దోహదపడనున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా కంచుకోట
మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్నే కాంక్షిస్తుంది. విజన్తో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో నాతోపాటు ప్రతి కార్యకర్త, ప్రజాప్రతినిధి కృషిచేస్తున్నారు. జిల్లాలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నేను ప్రతిక్షణం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటా. వాళ్ల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతం నుంచి కాంగ్రెస్, బీజేపీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా కంచుకోటగా ఉంది.
సంక్షేమం, అభివృద్ధియే గెలిపిస్తుంది
గత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవే గాక ఎవరూ అడగక పోయినా సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకువచ్చి వాటిని కూడా అమలు చేస్తున్నారు. 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీసీ, మైనార్టీలకు రూ.లక్ష సాయం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గర్భిణులకు కేసీఆర్ కిట్ అందజేస్తున్నాం. గతంలో రైతులకు విత్తనాలు, ఎరువులు దొరికేవి కావు. ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. ప్రభుత్వం అన్నివర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నది. కుల సంఘాలకు స్థలాలు ఇచ్చి భవనాలను కూడా కట్టిస్తున్నది. పేద విద్యార్థుల చదువుకు పెద్ద పీట వేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది. పల్లె, బస్తీ దవాఖానలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం వల్ల అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చింది. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. కేంద్రం ఆంక్షలు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ సాహసం చేసి పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం మరెక్కడా లేదు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు ఇవన్నీ ప్రభావితం చూపుతాయి.
అభివృద్ధిలోఆదర్శంగా మహేశ్వరం
సీఎం కేసీఆర్ సారథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతుండటంతో ప్రజల్లో సంతోషం కనిపిస్తున్నది. వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురవ్వకుండా ఎస్ఎన్డీపీ పథకం కింద రూ.110కోట్లతో నాలాలను అభివృద్ధి చేశాం. ఇంకా రూ.30కోట్లకు ప్రతిపాదనలు ఉన్నాయి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 20ఏండ్లుగా కోర్టు వివాదంలో ఉన్న సమస్యను ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించాం. 12 ఎకరాల్లో ఫంక్షన్ హాల్, మున్సిపల్ భవనం, మైదానం, స్కూల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఒకే సముదాయంలో నిర్మించాం. ప్రస్తుతం క్యాంపు కార్యాలయం నిర్మించిన స్థలం గతంలో కోర్టు వివాదంలో ఉండేది. దాన్ని కూడా పరిష్కరించి ప్రభుత్వానికి దక్కేలా చేశాం. అర్బన్ పార్కులతోపాటు రూ.50 – 60కోట్ల వరకు వెచ్చించి చెరువులను సుందరీకరించాం.
రెండో స్థానం కోసమే.. కాంగ్రెస్, బీజేపీ పోటీ
జిల్లాలో అందరం కలిసి కట్టుగా పనిచేసి విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నేనే కాదు.. అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులం గెలిచి తీరుతాం. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం. తెలంగాణకు ముందు తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక ఈసారి గెలిచేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్కు పోటీ ఎవరూ లేరు. కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నది రెండో స్థానం కోసమే.
విద్యను ఉన్నతంగాతీర్చిదిద్దడమే నా ఆశయం
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది నా ఆశయం. జూనియర్ కళాశాల, రెండు డిగ్రీ గురుకుల కళాశాలలు, పాలిటెక్నిక్, డైట్ కాలేజీలను కొత్తగా ఏర్పాటు చేశాం. రూ.14కోట్లతో పాలిటెక్నిక్ కాలేజి భవనాన్ని నిర్మిస్తున్నాం. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో స్కూళ్ల ఆధునీకరణ, కస్తూర్బా గాంధీ, మోడల్ స్కూల్ వంటి విద్యాశాఖ సంబంధిత వాటికే రూ.150కోట్ల వరకు వెచ్చించాం. పెద్ద ఎత్తున బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశాం. ఇటీవల అప్గ్రేడ్ అయిన సీనియర్ సివిల్ కోర్టు భవనాన్ని రూ.24కోట్లతో నిర్మించబోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకే గడిచిన తొమ్మిదేండ్లలో రూ.2వేల కోట్లకు పైగా వెచ్చించాం. సంక్షేమ కార్యక్రమాలతో కలిపి ఈ మొత్తం రూ.5వేల కోట్లకు పైగా ఉంటుంది.
ఎక్కడకు వెళ్లినా అక్కలా..అమ్మలా ఆశీర్వదిస్తున్నరు
నా సొంత నియోజకవర్గమైన మహేశ్వరం ప్రజలు నాకు దైవ సమానం. వారి ఆశీర్వాదంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు ప్రజల మద్దతు నాకు పుష్కలంగా ఉంది. ఎక్కడకు వెళ్లినా అక్కలా.. అమ్మలా భావించి అప్యాయంగా చూసుకుంటారు. మేం బీఆర్ఎస్ జెండా పట్టుకొని ఏ ఊరికి వెళ్లినా.. ప్రజలకు అందులో సీఎం కేసీఆర్ కనబడుతారు. సీఎం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నది. నేను నిత్యం ప్రజల్లోనే ఉంటా. నేను ముఖ్యమంత్రి దృష్టికి ఏ సమస్యను తీసుకువెళ్లినా.. వెంటనే నిధులు మంజూరు చేస్తుండటం నా అదృష్టం. నాపై విశ్వాసం ఉంచి మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
తొమ్మిదేండ్లలో ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ తొమ్మిదేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. పారిశ్రామికంగా ఈ ప్రాంతం గొప్ప ప్రగతిని సాధించింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావడానికి శాంతి భద్రతల సమస్యలు లేకపోవడం ఓ కారణం కాగా.. ప్రభుత్వ అనుమతులతోపాటు అన్ని వసతులు కల్పించడం మరో కారణం. ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తీరాయి. రోడ్లను అభివృద్ధి చేసి కనెక్టివిటీని పెంచాం. ఎల్బీనగర్తోపాటు మరో మూడు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఏ వైద్య సాయం కావాలన్నా దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సుంకిశాల నుంచి కృష్ణా నీళ్లతోపాటు గోదావరి నీటిని తెచ్చి వచ్చే 50ఏళ్లనాటికి కూడా తాగు నీటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం. ఫాక్స్కాన్ కంపెనీతో లక్ష మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ కంపెనీ మరో యూనిట్ను కూడా నెలకొల్పాలనుకుంటున్నది. శంషాబాద్కు మెట్రో విస్తరణ పనులకు సన్నాహాలు జరుగుతుండగానే.. మహేశ్వరం, షాద్ నగర్ వంటి ప్రాంతాలకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మహేశ్వరంలో మెడికల్ కాలేజీ సైతం ఏర్పాటవుతున్నది. కాళేశ్వరంకు మించిన పాలమూరు-రంగారెడ్డి భారీ ఎత్తిపోతల పథకం త్వరలోనే సాకారమై సాగు, తాగు నీటి పరంగా ఇబ్బందులు శాశ్వతంగా తీరనున్నాయి. హైదరాబాద్ కేంద్రీకృతంగా కాకుండ ఔటర్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలకు మేలు చేకూర్చేలా ప్రణాళికలను రూపొందించుకొని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.
అలసటను సైతంమర్చిపోయా..
ఈ మధ్యనే నేను ఒకే రోజు 65 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశా. బాగా పనిచేస్తున్నారు.. మిమ్మల్ని మళ్లీ గెలిపించుకుంటామని ప్రజలు చెప్తుంటే.. అలసటను సైతం మర్చిపోయా.
ఓ ఊరికి వెళ్లినప్పుడు ఓ రైతు తనకు ఉన్న ఎకరం భూమిని భార్య, కొడుకు పేరున గుంట చొప్పున చేసినట్లు చెప్పిండు. రైతు భీమా కోసమని చెప్తే సీఎం కేసీఆర్ పథకాలపై ప్రజలకు ఎంత భరోసా ఉన్నదో అర్థమైంది.
సుందరీకరించిన చెరువు ప్రాంతాల్లో ఉద్యోగాల శిక్షణలో భాగంగా ప్రాక్టీస్కు వచ్చే యువకులకు చాలా బాగా ఉపయోగపడుతున్నదని చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంటుంది.