సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్లో అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లోని బంజారాభవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకు ఓటరు నమోదుపై శిక్షణ కార్యక్రమాన్ని వికాస్రాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ… గతంలో శేరిలింగంపల్లి జోనల్ ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు కొన్ని సమస్యలు తెలియజేశారని గుర్తు చేశారు. ఈ తరహా సమస్యలు పునరావృతం కాకుండా కాలనీల్లో ఓటరు నమోదు చేయాలని సూచించారు.
10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి..
ఓటరు గుర్తింపులో ఆర్డబ్ల్యూఏ ప్రతినిధుల సహకారం తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు. ముందుగా రెసిడెన్షియల్ కాలనీ ప్రతినిధి సహకారంతో ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఓటరు నమోదుకు సంబంధించిన ప్రామాణికతను తెలియజేసి, అందుకు అర్హులైన వారిని ఓటరు నమోదుకు ప్రణాళికను రూపొందించుకుని బీఎల్ఓలు ముందుకెళ్లాలని సూచించారు. ఓటరు నమోదుకు ఒకేసారి పూర్తి వివరాలతో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. కాలనీల్లో ఉన్న గృహాలకు సంబంధించిన వారే కాకుండా కాలనీ సమీపంలో ఉన్న అర్హత గల వారిని కూడా ఓటరుగా నమోదు చేయాలని, ఈ ప్రక్రియను 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయించాలి : లోకేశ్ కుమార్
తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారీలో బూత్స్థాయి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని అదనపు ఎన్నికల ప్రధాన అధికారి లోకేశ్ కుమార్ అన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, ఒకే ఇంటిలో ఉన్న వారు ఇంకొక పోలింగ్స్టేషన్, బార్డర్ నియోజకవర్గంలో ఉన్న పక్షంలో వాటిని సరి చేయాలని సూచించారు. అంతేకాకుండా ఫొటోలు మిస్మ్యాచ్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇంటి నంబరు, అడ్రస్ మార్పు, ఒకే కుటుంబ సభ్యుల ఓటర్లు, ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా, పుట్టిన తేదీ, రిలేషన్ లాంటి తప్పులను కూడా సవరించేందుకు కృషి చేయాలన్నారు.
ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు : రోనాల్డ్ రోస్
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులతో పాటు ఓటింగ్ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ఒకే కుటుంబ సభ్యుల ఓటర్లు విభిన్న పోలింగ్ స్టేషన్లో నమోదు అవుతున్నాయని, వివిధ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీఈఓ సర్పరాజ్ అహ్మద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అమోయ్కుమార్, హరీశ్, శరత్, అదనపు కమిషనర్ శంకరయ్య, జాయింట్ కమిషనర్ మంగతాయారు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.