బంజారాహిల్స్, జనవరి 21: క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించేందుకు బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అత్యాధునిక మొబైల్ స్క్రీనింగ్ బస్సును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో అందుబాటులోకి తీసుకువచ్చారు.ఆదివారం బంజారాహిల్స్లోని ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ ప్రారంభించారు.
రూ.1.60 కోట్ల విలువైన మొబైల్ స్క్రీనింగ్ బస్సు కోసం ఎస్బీఐ రూ.1.5 కోట్లను సీఎస్ఆర్ కింద అందజేసిందని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ మొబైల్ బస్సులో అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ యంత్రాలతో పాటు క్యాన్సర్ నిర్ధారణకు ప్రాథమిక పరీక్షలకు కూడా సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి అసోసియేట్ డైరెక్టర్ డా. కల్పనా రఘునాథ్ మాట్లాడుతూ ఆస్పత్రి క్యాన్సర్ స్క్రీనింగ్ విభాగం ద్వారా ఇప్పటికే 1177 ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ జితేందర్కుమార్ శర్మ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి బోర్డు సభ్యులు జేఎస్ఆర్. ప్రసాద్, డా.ఫణి కోటేశ్వర్రావు పాల్గొన్నారు.