ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 8: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్టాత్మక నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యానిఫ్యాక్చరింగ్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ మాట్లాడుతూ… 2025 నాటికి సంకలిత తయారీ ద్వారా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీకి వన్ బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారాన్ని జోడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
తెలంగాణతో సహా మొత్తం భారతదేశానికి ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న వివిధ పరిశ్రమల అవసరాలను తీర్చడంతో పాటు వినూత్న స్టార్టప్లను ప్రోత్సహిస్తూ సంకలిత తయారీ (3డీ ప్రింటింగ్)కి అంకితమైన అత్యాధునిక సాంకేతికతలకు ఇది మొదటి జాతీయ స్థాయి కేంద్రమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఏఎం సీఈవో జస్ప్రీత్ సిద్ధూ, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సీనియర్ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.