శేరిలింగంపల్లి, మే 25: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నప్పటికీ హైదరాబాద్ అభిమానులకు ప్రత్యేకత ఉందని ప్రముఖ పాటల బాలీవుడ్ స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ అన్నారు. శనివారం గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ “అర్మాన్ లైవ్ మ్యూజిక్ షో” కార్యక్రమాన్ని పురస్కరించుకొని నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని షెరటాన్ హోటల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగులో తాను పాడిన ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా’ పాట తన కెరీర్లో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని, ఎక్కడ లేని గుర్తింపును తెచ్చిపెట్టిందన్నారు.
‘అలా.. వైకుంఠపురం’ సినిమా మరచిపోలేని సంతృప్తిని మిగిల్చిందన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడలతో పాటు వివిధ భాషల్లో తాను చాలా పాటలు పాడినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన తల్లి తెలుగమ్మాయి కావడంతో తెలుగు భాషతో విడదీయరాని బంధం కలిగి ఉన్నట్లు తెలిపారు. కరోనా తర్వాత హైదరాబాద్ నగరంలో నిర్వహించిన తన తొలి మ్యూజిక్ కన్సర్ట్ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదని, హైదరాబాద్ సంగీత ప్రియులు, యువత తనను ఎంతో ఆదరించారన్నారు. అందుకే, హైదరాబాద్ తన కలిసివచ్చిన అదృష్ట నగరమన్నారు. ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా’ అంటూ పాట పాడి అందర్నీ అలరించారు.