సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మాట్లాడే స్వేచ్ఛ, ఇష్టమైన ఆహారం తినే హక్కు, సమానత్వం ఇతరత్రా ప్రాథమిక హక్కులను కాలరాసే అధికారం ఎవ్వరికీ లేదని జ్ఞాన్పీఠ్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ కొంకణి రచయిత దామోదర్ మౌజో అన్నారు. అన్నివేళలా న్యాయం వైపు నిలబడాలి.. అన్యాయాన్ని వ్యతిరేకించాలని ఆయన చెప్పారు. “కల్బుర్గి, గౌరీ లంకేశ్ లను హత్య చేసిన సందర్భంలో తాను గళమెత్తాననే కారణంతో నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపుల నుంచి రక్షణకు ప్రభుత్వం నాకు సెక్యూరిటీ కల్పించింది. అయితే ఈ సెక్యూరిటీ నన్ను కాపాడుతుందని నేను అనుకోవడం లేదు. అనేక మంది సెక్యూరిటీ ఉన్న వ్యక్తులను కూడా హత్య చేయగలమని వాళ్లు నిరూపించారు. అసలైన పిరికిపందలు చంపుతామని బెదిరించేవాళ్లే.” అని దామోదర్ మౌజో అన్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో తినడంపై ఏబీవీపీ లాంటి సంఘాలు నిషేధం విధిస్తున్నాయని.. ఇలాంటి వాటిని సహించొద్దని చెప్పారు. ప్రజలు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ సందర్భంగా ప్రీతి సర్దేశాయ్ డిష్కషన్లో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన కొంకణి భాషా ప్రాముఖ్యత, భాషపై జరిగిన విధ్వంసంపై మాట్లాడారు.
గోవాలో కొంకణి భాష కనుమరుగవడం, తిరిగి అధికార భాషగా పేరొందడానికి మధ్య జరిగిన పోరాటాన్ని వివరించారు. ప్రస్తుతం గోవా దేశ రాజకీయాలకు కేంద్రంగా మారిందని చెప్పారు. గతంలో గోవాను మౌర్యులు, శాతవాహన, విజయనగర రాజులు తదితరులు పాలించారని, అనంతరం పోర్చుగీస్ వాళ్ల వ్యాపారం పేరుతో గోవాలో ప్రవేశించి..స్వాధీనం చేసుకుని గోవా సంస్కృతి, సంప్రదాయాలను కొల్లగొట్టిందని ధ్వజమెత్తారు. స్థానిక భాష కొంకణి కనుమరుగవడానికి పోర్చుగ్రీస్ పాలనే కారణమని ఆరోపించారు.
గోవాలో ఉన్న ఆలయాలను, చరిత్ర ఆనవాళ్లను కూల్చేసి.. మిషనరీలను స్థాపించి గోవా ప్రజలను బలవంతంగా తమ మతంలోకి మార్చుకున్నారని చెప్పారు. కొంకణి భాషా మాట్లాడేవారిని ఉరితీశారని అన్నారు. ఆ సమయంలో చాలా మంది కొంకణి మాట్లాడే ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, కేరళకు పారిపోయారని గుర్తు చేశారు. కొంకణి భాష అంటూ ఒకటి ఉందని కూడా మరిచిపోయేలా భాష పుట్టుకను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది రచయితలు ఆ భాష ఉనికిని వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పారు.
కేవలం మాట్లాడటానికే అందుబాటులో ఉన్న ఆ లాంగ్వేజీని స్క్రీప్ట్ రూపంలో తీసుకురావడానికి కృషి చేసినట్టు వివరించారు. నేను కొంకణి లాంగ్వేజీలో రాసినందుకు నాకు జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం గర్వంగా ఉందని అన్నారు. ఇప్పటికి కొంతమంది వలసవెళ్లిన వాళ్లు గోవాకు రాలేకపోతున్నారని చెప్పారు. అందుకు కారణం వాళ్లు కొంకణి వాళ్లని తెలిస్తే అక్కడ ప్రభుత్వ పథకాలు దూరమవుతాయనే భయమేనని పేర్కొన్నారు. రచయితలు ప్రశంసల కోసం రచనలు చేయొద్దని రాబోయే తరం కోసం రచనలు చేయాలని పిలుపునిచ్చారు. భాష నాణ్యతను పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.