ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 25: ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మకమైన వేడుకలు ఈ నెల 31న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, ముఖ్య అతిథిగా ఓయూ పూర్వ విద్యార్థి, అడోబ్ సీఈవో శంతన్ నారాయణ్ హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో 2021 జూలై నుంచి 2022 అక్టోబర్ వరకు స్వర్ణ పతకాలు, పీజీ పట్టాలతో పాటు 2022 ఆగస్టు నుంచి 2023 అక్టోబర్ వరకు ఎం.ఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేయనున్నారు. కానీ, వేడుకల్లో గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వర్ణ పతకాలు, ఎం.ఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన వారికి మాత్రమే వాటిని ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ వర్సిటీ నివేదికను సమర్పిస్తారు. అనంతరం, గవర్నర్, ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ www.osmania.ac.in లో చూడవచ్చని అధికారులు తెలిపారు.
ప్రతిష్టాత్మకం ఓయూ గౌరవ డాక్టరేట్
ప్రతి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయరు. ఇప్పటివరకు కేవలం 48 మందికి మాత్రమే ఓయూ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. చివరిసారిగా గతేడాది అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ అందించింది. ఈ ఏడాది ఎవరికీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయకపోవచ్చని అధికారులు వివరించారు.
గుర్తింపు కార్డులు తప్పనిసరి
స్వర్ణ పతకాలు, ఎం.ఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన అభ్యర్థులు స్నాతకోత్సవానికి రెండు రోజుల ముందుగా ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయంలో సంప్రదించి గుర్తింపు కార్డులు, ఆహ్వాన పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. పట్టాలు పొందే ప్రతి ఒక్కరు విధిగా తెలుపు దుస్తులు ధరించాలని చెప్పారు. స్నాతకోత్సవ సంప్రదాయం ప్రకారం, అలా వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని, గుర్తింపు కార్డులు వెంట కచ్చితంగా తెచ్చకోవాలని తెలిపారు.
57 బంగారు పతకాల ప్రదానం
స్నాతకోత్సవంలో గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా పీజీ, పీహెచ్డీలలో స్వర్ణ పతకాలు సాధించిన 57 మందికి వాటిని ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు దాదాపు 700 మందికి పీహెచ్డీ పట్టాలు అందించనున్నారు. యూజీలో స్వర్ణ పతకాలు సాధించిన వారికి వారి వారి కళాశాలలకు పతకాలను పంపిస్తారు.
గతేడాది 82వ స్నాతకోత్సవం
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం, 83వ స్నాతకోత్సవాన్ని జరుపుకుంటోంది. స్నాతకోత్సవంలో పతకాలు, పట్టాలు పొందడాన్ని విద్యార్థులు ఎంతో గొప్పగా భావిస్తారు. ఈ స్నాతకోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించడం లేదు. చివరిసారిగా 82వ స్నాతకోత్సవాన్ని 2022 ఆగస్టు 5న నిర్వహించారు.