Hyderabad | జూబ్లీహిల్స్, మార్చి 22 : జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని ఆరోగ్య నగర్లో ఉన్న ఎస్టీ గురుకుల వసతి గృహంలో శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థులు ప్లేట్లు చేత పట్టుకుని ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తూ బైఠాయించారు. నాణ్యమైన ఆహారం అందించ కుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని.. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుకునే విద్యార్థులకు కేటాయించిన ఈ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో తరచుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతులు కూడా లేవని.. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి హాస్టల్కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సంఘటన వివరాలను ఫోన్లో మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలియజేసి విద్యార్థులతో మాట్లాడించారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.