సిటీబ్యూరో/అబిడ్స్/సుల్తాన్బజార్, మార్చి 30: నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. రామనామస్మరణతో మార్మోగింది. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకొని.. రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. మరోవైపు సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్ నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు, ప్రధాన కార్యదర్శి గోవింద్రాఠి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామ భవ్య శోభాయాత్ర కనులపండువగా సాగింది. శ్రీ కాశీ సుమేరు పీఠాధీశ్వర్ యతి సామ్రాజ్ అనంత్ శ్రీ విభూషిత్ జగద్గురు శంకరాచార్య స్వామి నరేంద్రనంద సరస్వతి జీ మహారాజ్, క్రాంతికారి శ్రీ సంత్ భోమారామ్జీ మహారాజ్ , వీహెచ్పీ నాయకులు రామరాజులు సీతారామచంద్రస్వామి ఆలయంలో యాత్రను ప్రారంభించారు.
ధూల్పేట్ రాణి అవంతిబాయి భవన్ నుంచి శోభా యాత్రను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. ఇక ధూల్పేట్ మాగ్రా నుంచి శ్రీరామ పల్లకీ యాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్ ప్రారంభించారు. కాగా, పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి చివర వరకు క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బందికి సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేలా నగర ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే ట్రాఫిక్ మళ్లింపు నిర్వహించారు.