వాడవాడలా రాములోరి కల్యాణం
రెండేండ్ల తర్వాత అంగరంగ వైభవంగా శోభాయాత్ర
కాషాయజెండాలతో కదిలివచ్చిన జనం
ఆకర్షణీయంగా అయోధ్య రామ మందిరం సెట్టింగ్
శోభాయాత్ర ప్రాంతాల్లో సీపీ సీవీ ఆనంద్ పర్యటన
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా
ప్రజల సహకారంతో ప్రశాంతంగా ముగింపు
పచ్చటి పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. మేళతాళాల సందడి.. అశేష భక్తుల జయజయ
ధ్వానాల నడుమ శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. నగరం నలుమూలల రాములోరి
కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. జగధబిరాముడి పెండ్లి వేడుకను కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంలో
మునిగిపోయారు. జై శ్రీరాం.. జై జై శ్రీరాం నినాదాలు చేస్తూ భక్తిభావం చాటుకున్నారు. మరోవైపు శ్రీరామ నవమిని
పురస్కరించుకొని సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. భాగ్యనగర్
శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్ర జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్,
చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, కోల్సావాడి, సిద్దంబర్బజార్, గౌలిగూడల మీదుగా హనుమాన్ టేక్డీలోని హనుమాన్
వ్యాయామశాలకు చేరింది. ఈ యాత్రలో నగర యువత ఉత్సాహంగా పాల్గొంది. శోభాయాత్రలో ఎలాంటి
అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఆర్ఏఎఫ్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అబిడ్స్/సుల్తాన్బజార్, ఏప్రిల్ 10: శ్రీరామనవమి శోభాయాత్ర వేలాది మంది భక్త జనసమూహంతో కన్నులపండువగా సాగింది. నగర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో యువత కాషాయ జెండాలు చేతబట్టి శోభాయాత్రలో పాల్గొన్నారు. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత నిర్వహించిన శోభాయాత్రకు అశేష జనవాహిని నగరంలోని అన్ని రహదారుల నుంచి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంది. సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహించగా, ధూల్పేట్ నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో యువకులు శోభాయాత్రలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో పురవీధులన్నీ మారుమోగాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి పల్లకీ సేవలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నంద కిశోర్వ్యాస్, బేగంబజార్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ పూజావ్యాస్ బిలాల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది భక్తులతో ప్రారంభమైన శోభాయాత్ర జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, కోల్సావాడి, సిద్దంబర్బజార్, గౌలిగూడల మీదుగా హనుమాన్ టేక్డీలోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంది.
అయోధ్య రామమందిరం సెట్టింగ్..
శ్రీరామ నవమి శోభాయాత్రలో అయోధ్య రామ మందిరం సెట్టింగ్, శ్రీరాముడు, హనుమంతుడు, శంకరుడు, రామ్దర్బార్, గోమాత, రాణి అవంతిబాయి, భారతమాత విగ్రహాలు ఆకర్శణగా నిలిచాయి. ఈ సారి శ్రీరాముని విగ్రహం చుట్టూ హనుమంతుని విగ్రహం తిరుగుతున్నట్లు టెక్నాలజీతో ఏర్పాటు చేయడం అందరిని ఆకర్శించింది.
ద్రౌపది గార్డెన్లో ప్రత్యేక పూజలు
సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్ నుంచి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ భగవంతరావు, కన్వీనర్ గోవింద్రాఠిల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ భవ్య శోభాయాత్రను పాట్నాకు చెందిన ఉమా మండలేశ్వర ఆచార్య సునీల్ శాస్త్రి,అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షులు త్రిదండి రామానుజ జీయరు స్వామి మహా రాజ్, జాతీయ వర్కింగ్ అధ్యక్షులు కమలేశ్వర్ మహారాజ్, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజులు సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం యాత్రను ప్రారంభించారు. ఇదిలా ఉండగా ధూల్పేట్ రాణి అవంతిబాయి భవన్ నుంచి ప్రతి యేడాది నిర్వహించే శ్రీ రామ భవ్య శోభా యాత్రను ఆకాష్పురి హనుమాన్ దేవాలయంలో గజానంద్ మహారాజ్ ప్రత్యేక హోమం నిర్వహించిన అనంతరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు.
అడుగడుగునా నిఘా
శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సందర్శించి బందోబస్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్, పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్లు సీతారాంబాగ్, ధూల్పేట్ ప్రాంతాలను సందర్శించారు. సిద్దంబర్బజార్ వద్ద డ్రోన్ కెమెరాలతో శోభాయాత్రను పర్యవేక్షించారు. యాత్ర జరిగే దారి పొడవునా ఉన్న మసీదులకు పరదాలు కట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రజల సహకారంతో ప్రశాంతం
7 వేల మందితో పటిష్ట బందోబస్తు ..
హైదరాబాద్ ప్రజల సహకారంతో ఆదివారం శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఈ శోభాయాత్రకు 7 వేల మందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బషీర్బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను నిశితంగా పరిశీలించామని చెప్పారు. త్వరలో ప్రతి జోన్కు ఒక డ్రోన్ను ఏర్పాటు చేసి వాటితో ఆధునిక పోలీసింగ్ను నిర్వహిస్తామని అన్నారు. భద్రతకు అక్టోపస్, గ్రేహౌండ్స్, ఆర్ఏఎఫ్, ఇతర బలగాలను మోహరించామని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ర్యాలీ సజావుగా సాగిందని చెప్పారు. ఉత్సవ కమిటీతో నిరంతరం సమీక్షిస్తూ, కోర్టు అనుమతితో నగరంలో ర్యాలీలన్నీ ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. కమాండ్ కంట్రోల్కు అనుసంధానమైన సీసీ కెమెరాలతో ర్యాలీని పరిశీలించారు.
శోభాయాత్ర జరిగే ప్రాంతాలను సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. అనంతరం బషీర్బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మాట్లాడుతూ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసిందని ప్రకటించారు.