సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ ): దేశంలోని అన్ని మెట్రో నగరాలను సందర్శించే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులంతా హైదరాబాద్ నగరం గురించే ప్రస్తావిస్తున్నారు. అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉన్నాయి. వాటి నిర్మాణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు లేవని చెప్పుకుంటున్నారు. సిగ్నల్ రహిత ప్రయాణంతో వాహనదారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని రద్దీ ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని ఎస్ఆర్డీపీ రెండో దశకు శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రధానంగా పెరుగుతున్న జనాభా-విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా బహుముఖ వ్యూహంతో మరింత పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధిని కొనసాగిస్తున్నది. ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ద్వారా తొలి విడత 47 పనులలో రూ.3248.53 కోట్లు వెచ్చించి 35 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరో 13 చోట్ల రూ.3515.33 కోట్లతో చేపడుతున్న పనులు పురోగతిలో ఉండగా.. ఈ ఏడాది చివరి నాటికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో మరిన్ని రద్దీ ప్రాంతాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్డీపీ రెండవ దశకు శ్రీకారం చుట్టింది.
రూ.4305 కోట్ల వ్యయంతో రెండవ దశ
ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.4305 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది. జీహెచ్ఎంసీ చేపట్టబోయే ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరుపై ఇటీవల మంత్రి కేటీఆర్ భరోసా ఇవ్వడంతో ఈ రెండో దశ ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక గ్రాంటు కానీ రుణాల గ్యారంటీపై ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నదని, త్వరలోనే ఎస్ఆర్డీపీ రెండో దశ పనులు ప్రారంభానికి సన్నద్దమవుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.