వెంగళరావునగర్, మార్చి 10: రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన వాహనాలు తనిఖీల్లో ఓ ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.10,78,885 నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పి.వెంకటరమణ, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి వివరాలను వెల్లడించారు. ఎస్ఆర్నగర్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా..
హఫీజ్పేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న మహేంద్రకుమార్ (38) అనే వ్యాపారి ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా.. ఆ వాహనంలో రూ.5.80 లక్షల నగదు, రూ. 3,86,640 విలువజేసే 64.440 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,12,245ల విలువజేసే 1420.83 గ్రాముల వెండి ఆభరణాలను గుర్తించారు. నగదు, ఆభరణాలను గురించి ప్రశ్నించగా.. అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. ఎలాంటి పత్రాలు కూడా చూపించలేదు. దీంతో పోలీసులు నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.