అమీర్పేట్, మార్చి 21: పిల్లలతో సమానంగా పెంపుడు జంతువులకు కూడా ప్రేమను పంచాలని ప్రముఖ సినీనటుడు శరత్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన హెర్మయో డంకన్ రెడ్డి ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శరత్కుమార్ మాట్లాడుతూ… పెంపుడు జంతువులతో మమేకమవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడగలమన్నారు. హెచ్డీఆర్ఎఫ్ సంస్థ త్వరలోనే నగరంలో పెంపుడు జంతువుల కోసం పూర్తి స్థాయి మల్టీ స్పెషాలిటీ, డయాగ్నస్టిక్స్ సెంటర్లను నెలకొల్పనుందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడిని అభినందించారు. రేబిస్ నివారణకు సంబంధించి పెంపుడు జంతువులతో పాటు వీధి కుక్కలకు కూడా మైక్రో చిప్లు ఇంజెక్ట్ చేయడం వంటి కార్యక్రమాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హెచ్డీఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 24న నెక్లెస్ రోడ్డులోని పెట్స్ పార్కులో పెంపుడు జంతువులతో పాటు, వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్డీఆర్ఎఫ్ బోర్డు మెంబర్లు అర్చన, సంధ్య తదితరులు పాల్గొన్నారు.