సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర శివారులోని మోకిలలో ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటైన ఇక్ఫాయ్ హైదరాబాద్ క్యాంపస్లో మేనేజ్మెంట్ విద్యార్థుల క్రీడా పోటీలు ఉత్కంఠగా జరుగుతున్నాయి. 12 క్రీడాంశాల్లో జరుగుతున్న పోటీలను మూడు రోజుల పాటు నిర్వహిస్తుండగా, మొదటి రోజు పోటీలు పూర్తి కాగా, రెండో రోజు పోటీలు శనివారం క్యాంపస్లోని వివిధ మైదానాల్లో విద్యార్థుల కేరింతల మధ్య హోరాహోరిగా సాగాయి. దేశంలోని వివిధ నగరాల్లోని బిజినెస్ స్కూల్స్కు చెందిన విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలకు ఎంతో ప్రాధాన్యత నెలకొంది. ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ (ఐబీఎస్) హైదరాబాద్కు చెందిన టీమ్ వ్యాప్స్ ఆధ్వర్యంలో ఆవేగ్ 14 పేరుతో నిర్వహిస్తున్న బిజినెస్ స్కూల్స్ ఇంటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్కు మీడియా స్పాన్సర్స్గా నమేస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంస్థలు వ్యవహరిస్తున్నాయి. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు 9 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. బాస్కెట్బాల్ పోటీల్లో ఐబీఎస్ హైదరాబాద్, ఐపీఈ, వోక్సెన్, వీజెఐఎం విద్యా సంస్థలకు చెందిన బృందాలు మ్యాచ్ విజేతలుగా నిలిచారు.
అదేవిధంగా బ్యాడ్మింటన్ క్రీడలో మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో ఐబీఎస్ హైదరాబాద్, ఐపీఈ, ఉమెన్స్ సింగిల్స్ సెమి ఫైనల్లో ఐబీఎస్ హైదరాబాద్, వీజెఐఎంకు చెందిన బృందాలు, ఇక మెన్స్ డబుల్ సెమీ ఫైనల్స్ ఐబీఎస్ హైదరాబాద్, ఐపీఈ బృందాలు విజేతలుగా నిలిచాయి. వాలీబాల్లో ఐపీఈ, ధ్రువ, వోక్సెన్ విజేతలుగా నిలవగా, క్రికెట్లో ఐబీఎస్ హైదరాబాద్, ఐబీఎస్ బెంగళూరు, ఐపీఈ,ఐబీఎస్ బెంగళూరు, చెస్లో ఫైనల్ మ్యాచ్ విన్నర్గా సాత్విక్ బులుసు(ఐపీఈ), రన్నరప్గా శరన్ (ఐబీఎస్), అదేవిధంగా వోక్సెన్, ఐపీఈ టీంల మధ్య జరిగిన పుట్బాల్లో మ్యాచ్ డ్రా అయిందని నిర్వాహకులు తెలిపారు. క్యారమ్ ఫైనల్ మ్యాచ్ విజేతగా జి.కార్తిక్ (వీజెఐఎం), రన్నరప్గా టి. హితేశ్ (ఐబీఎస్) నిలిచారు. ఆదివారం జరిగే ఫైనల్ పోటీల అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నట్లు ఇక్ఫాయ్ ఐబీఎస్ హైదరాబాద్ టీమ్ వ్యాప్స్ అధ్యక్షుడు మహి త్యాగి, ఉపాధ్యక్షుడు భాస్కర్ యాదవ్ తెలిపారు. వివిధ బిజినెస్ స్కూల్స్ నుంచి విద్యార్థులు తమ కిష్టమైన క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు.