రామంతాపూర్, సెప్టెంబర్ 23 : ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 29న జరిగే వామప్ మ్యాచ్కు ప్లేయర్లు, బీసీసీఐ, ఐసీసీ అధికారులు తప్ప ప్రేక్షకులను అనుమతించడం లేదని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ విషయాన్ని అందరు గుర్తించి పోలీసులకు సహకరించాలన్నారు. శనివారం రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో సీపీ డీఎస్ చౌహాన్, హెచ్సీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రపంచ కప్ – 2023 క్రికెట్ పోటీలు ప్రతిష్టాత్మకమైనవన్నారు. ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించడానికి వచ్చే అవకాశమున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రిటైర్డు డీజీపీ సీఆర్పీఎఫ్ దుర్గాప్రసాద్ ఐపీఎస్ , డీసీపీ అభిషేక్ మహంతి, ఐపీఎస్, ఎస్ఓటీ డీసీపీ -1 గిరిధర్, ఐపీఎస్, డీసీపీ రోడ్డు సేఫ్టీ శ్రీబాల, ఏసీపీ నరేశ్రెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, ఉప్పల్ ఇన్స్పెక్టర్, బీసీసీఐ అధికారులు, హెచ్సీఏ, డిఎన్ఏ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.