సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో తాగునీటి సరఫరాతో పాటు సీవరేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వార్డు అసిస్టెంట్లు పనిచేయాలని ఎండీ దానకిశోర్ సూచించారు. వివిధ వార్డుల్లో పనిచేయడానికి ఎంపిక చేసిన అసిస్టెంట్లకు శుక్రవారం జలమండలిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ దానకిశోర్ పాల్గొని ప్రసంగించారు. వార్డులో జలమండలి తరఫున సిబ్బంది పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.
వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా వార్డు అసిస్టెంట్లు పనిచేయాలని ఎండీ దానకిశోర్ తెలిపారు. జలమండలి ఇప్పటికే కస్టమర్ కేర్ సెంటర్, ఆన్లైన్, ట్విట్టర్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. వీటికి తోడు ప్రజలు నేరుగా ఇచ్చే ఫిర్యాదులను సంబంధిత సెక్షన్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఫిర్యాదులను ఎంసీసీలో నమోదు చేసి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలన్నారు. వార్డు స్థాయిలో నమోదయ్యే తాగునీటి, సీవరేజీ సమస్యలపై క్షేత్రస్థాయిలో ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు.
వార్డు అసిస్టెంట్లకు సంబంధించి 8 అంశాలపై దృష్టి సారించనున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. వాటిని కంప్యూటర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ ఫిర్యాదులను సంబంధిత మేనేజర్ దృష్టికి తీసుకువెళ్తారు. తర్వాత వాటిని ఫాలోఆప్ చేసుకోవాల్సి ఉంటుంది. మేనేజర్ నుంచి యాక్షన్ స్టేషన్ రిపోర్టు తీసుకోవాలి. ఆ రిపోర్టును కంప్యూటర్లో నమోదు చేయాలి. ఫిర్యాదు పరిష్కారంపై సంబంధిత వినియోగదారులకు సమాచారం అందజేయాల్సి ఉంటుంది.