సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : మత, రాజకీయ పరమైన విషయాలపై పోలీసులు పటిష్టమైన నిఘా పెంచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ ఏసీపీలు, జోనల్ డీసీపీలు, అదనపు డీసీపీలు, జాయింట్ సీపీలు, అదనపు సీపీలతో మంగళవారం సీపీ కార్యాలయంలో శాంతి భద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సమర్దవంతమై పోలీసింగ్ ఆవశ్యకతపై వివరించారు. హోంగార్డు నుంచి నగరంలో పనిచేసే ప్రతి అధికారి తమ విధి నిర్వహణ బాధ్యతగా నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు మత, రాజకీయ పరమైన అంశాలలో నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా ఉండే గ్రూప్లు, అక్కడ ఏర్పడే పరిస్థితులకు వెంటనే ఎలా స్పందించాలి అనే విషయాలపై తగు సూచనలిచ్చారు.
మత, రాజకీయ పరమైన విషయాలలో నిఘాను మరింతగా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని సీపీ వివరించారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పోస్టింగ్లు తీసుకున్న ప్రొబేషనరీ ఎస్సైలు సిటీ పరిస్థితులను అలవాటు చేసుకొని అందుకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలు, మహిళా ఎస్సైలు, ఇన్స్పెక్టర్ల పనితీరు గురించి చర్చించారు.