Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : వేసవికాలం వచ్చిందంటే చాలా మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. పిల్లలకు సెలవులు కావడం, ఊష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు విహార యాత్రలు, తీర్ధయాత్రలు వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. మరికొంత మంది స్వస్థలాలకు పయణమవుతుంటారు. ఈ క్రమంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్తుంటారు. ఇదే అదునుగా చూసుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. అయితే గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో వేసవి దొంగతనాలు చాలా వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తి స్థాయిలో తగ్గలేదని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. సమ్మర్ క్రైమ్లో ముఖ్యంగా ఆటోమొబైల్, హౌస్ హోల్డ్ థెఫ్ట్, ప్రాపర్టీ థెఫ్ట్ వంటి ఆర్థిక పరమైన నేరాలు ఎకువగా జరుగుతుంటాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లే వారు విలువైన ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని పేర్కొన్నారు. ఉరెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
సమ్మర్ క్రైమ్స్ను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. సమ్మర్ క్రైమ్స్లో ముఖ్యంగా ఆటోమొబైల్, హౌస్ హోల్డ్ థెఫ్ట్, ప్రాపర్టీ థెఫ్ట్ వంటి ఆర్థిక పరమైన నేరాలు ఎకువగా జరుగుతుంటాయి. కమిషనరేట్ పరిధిలో ప్రధాన హాట్ స్పాట్స్ని గుర్తించాం. జోన్ల వారీగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన హాట్ స్పాట్లపై రోజువారి సమీక్ష నిర్వహించేలా సంబంధిత అధికారులను ఆదేశించాం. జోన్లవారీగా డే&నైట్ బీట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నా. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘా పెంచాం. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టాం. రానున్న 45రోజులు చాలా కీలకం.
– స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్