సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఐటీ ఉద్యోగులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రోజువారి ప్రయాణాన్ని మరింత సుఖమయం చేసేందుకు నడుంబిగించింది. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ప్రత్యేక షటిల్ బస్సులను నడుపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీసులను త్వరలోనే నడుపడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. సిటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్ది ప్రయాణించి ప్రస్తుతం ఆఫీసులకు చేరుకుంటున్నారు.
ఈ ప్రత్యేక షటిల్ సదుపాయంతో తక్కువ వ్యయం, తక్కువ సమయంతోనే సురక్షింతంగా గమ్య స్థానాలకు చేరుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. షటిల్ సర్వీసుల కోసం ఆన్లైన్ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్ఆర్టీసీ కోరుతున్నది. ఈ సర్వే వివరాల ఆధారంగా భవిష్యత్తులో ఐటీ కారిడార్లో మరిన్ని షటిల్ సర్వీసులను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఐటీ కారిడార్లో షటిల్ సౌకర్యాలను ఉపయోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు shorturlat/avCHI లింకుపై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. ఐటీ ఉద్యోగుల కంపెనీ వివరాలు, లొకేషన్, పికప్, డ్రాపింగ్ పాయింట్లను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని కోరుతున్నది.
బుకింగ్కు ప్రత్యేక యాప్..
ఐటీ ఉద్యోగులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడమే ప్రత్యేక షటిల్ బస్సు సర్వీసుల ప్రధాన ఉద్దేశమని, అందుకోసం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను వినియోగించుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రత్యేక యాప్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ యాప్లోనే టికెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తుంది. అలాగే ఈ సర్వీసులకు ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంటుందన్నారు. మహిళల భద్రత విషయంలో షటిల్ బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక యాప్లో సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం కోరుతున్నది.