మేడ్చల్, జనవరి 16(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. డంపింగ్ యార్డు సమీపంలోని కలుషితమైన ఎనిమిది చెరువుల నీటి శుద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లను మంజూరు చేసింది. దీంతో త్వరలోనే పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. డంపింగ్ యార్డ్ సమీపంలోని చెరువులలోకి కలుషతమైన నీరు వచ్చి చేరినట్లు అధికారులు గుర్తించారు. కలుషితమైన నీరు రాకుండా తిరిగి చెరువుల ద్వారా నీటి వినియోగం జరిగేలా చెరువులలో నీటిని శుద్ధి చేసి సుందరీకరణ పనులను చేపట్టనున్నారు. జవహర్నగర్ సమీపంలోని మల్కారం, చిన్నపురం, దమ్మాయి, నాసింగ్, హరిదాస్పల్లి, తిమ్మాయిపల్లి, జవహర్నగర్, చిర్యాల్లలోని చెరువులలో పనులను చేపట్టానున్నారు. డంపింగ్ యార్డు నుంచి చెరువులలోకి నీరు చేరకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కార పనులు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. డంపింగ్ యార్డులో చెత్త నిల్వలు లేకుండా చేసి భవిష్యత్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చెరువులలో నీటి శుద్ధి, సుందరీకరణ పనులకు నిధులు మంజూరు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘విద్యుత్ ఉత్పత్తి’తో చెత్త నిల్వలకు చెక్
జవహర్నగర్ డంపింగ్ యార్డులో త్వరలోనే నిర్మించనున్న 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైతే, డంపింగ్ యార్డులో చెత్త నిల్వలకు చెక్ పెట్టినట్లవుతుంది. 1500 ఎకరాల విస్తీర్ణంలో 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిర్మాణానికి సంబంధించి అనుమతులు రానున్నాయని, విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి పనుల ప్రారంభానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు డంపింగ్ యార్డు నిర్వాహకులైన రాంకీ ప్రతినిధులు తెలిపారు. డంపింగ్ యార్డులో ఇది వరకే ఉన్న 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు త్వరలోనే నిర్మాణానికి సిద్ధం అవుతున్న 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి మొత్తం 7,400 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం ఉంటుంది. రానున్న రోజులలో డంపింగ్ యార్డులోకి వచ్చిన చెత్త వినియోగంలోకి వెళ్లడంతో, అసలు చెత్త నిల్వలు ఉండే అవకాశం లేకుండా పోతుంది. డంపింగ్ యార్డు నుంచి శాశ్వతంగా దుర్వాసన రాకుండా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలకు మేరకు చర్యలు తీసుకున్నారు. చెత్త నిల్వలు లేకుండా ఉండటంతో జవహర్నగర్ సమీపంలోని చెరువులకు కలుషిత నీరు చేరకుండా ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు చెత్తతో ఎరువుల తయారీని రాంకీ నిర్వాహకులు తయారు చేస్తున్న విషయం తెలిసిందే.