కొండాపూర్ : తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ దేశాలతో పోటి పడే స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna rao ) అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్)తో పాటు మాదాపూర్(Madapur) లోని శిల్పారామాలయాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పర్యాటక (Tourism sector) , ఆతిథ్య ఉన్నత విద్యా, శిక్షణ సంస్థగా నిథిమ్ను తీర్చిదిద్దుతామన్నారు. నిథిమ్ అకాడమిక్ బ్లాక్లోని తరగతి గదులను, హాస్పిటాలిటీ బ్లాక్లోని కిచెన్, బేకరీ, ట్రైనీ రెస్టారెంట్ మాక్ రూమ్స్లను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బందికి యూజీసీ స్కేల్(UGC Scale) ప్రకారం వేతనాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులను విద్యార్థులకు అందించేలా ఇఫ్లూతో అసోసియేట్ అయ్యేలా చూడాలన్నారు. శిల్పారామం(Silparamam) నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధ్యయనం చేసి శిల్పారామం ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ, నిథిమ్ డైరెక్టర్ కే నిఖిల, టీఎస్టీడీసీ ఎండీ రమేష్ నాయుడు, శిల్పారామం ప్రత్యేక అధికారి జీ కిషన్రావు, నిథిమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిషెల్ జే ప్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.