మాదాపూర్, డిసెంబర్ 23: ఆసియాలోనే గుర్తింపు పొందిన ప్రార్థన మందిరాల్లో కల్వరి టెంపుల్ ఒకటి. కల్వరిలో ప్రతి ఏటా నిర్వహించే క్రిస్మస్ పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. క్రిస్మస్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని దేశంలోని పలు రాష్ర్టాల నుంచి విచ్చేయనున్న భక్తులకు భోజన వసతులు, వైద్యసేవలతో పాటు భద్రత ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రత్యేకం ఆకర్శణగా 100 అడుగుల క్రిస్మస్ ట్రీ ..
కల్వరి ప్రాంగణంలో 100 అడుగుల క్రిస్మస్ ట్రీ ని ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద క్రిస్మస్ ట్రీ గా దీన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
క్రీస్తు జన్మనాటక ప్రదర్శన..
కల్వరి టెంపుల్ నిర్వాహకులు నిర్వహించే ఆరాధనల్లో భాగంగా నాలుగు ప్రత్యేక సర్వీస్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా నాలుగు సర్వీస్లో క్యాండిల్ లైట్, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు, దైవజనులు, డాక్టర్ పి. సతీశ్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఆరాధన మహోత్సవంలో భాగంగా భక్తులకు క్రీస్తు సందేశాన్ని వివరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం క్రీస్తు జన్మ రహస్యాన్ని తెలిపే నాటక ప్రదర్శనను కండ్లకు కట్టినట్లుగా ప్రదర్శించనున్నారు.
వేదిక ఏర్పాట్లు …
క్రిస్మస్ సందర్భంగా దేశ నలుమూలల నుంచి సుమారు 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు విచ్చేయనున్నారు. ఇందులో భాగంగా క్రిస్మస్ వేడుకలకు సుధూర ప్రాంతాల నుండి విచ్చేయనున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆకర్శణగా కల్వరీలోని మూడు ప్రార్థన మంధిరాల్లోని వేదికపై క్రిస్మస్ ట్రీతో పాటు రంగు రంగుల లైట్స్తో కూడిన వేదికను ఏర్పాటు చేయనున్నారు.
భక్తుల కోసం ప్రత్యేక వసతులు ..
కల్వరి టెంపుల్లో భక్తులకు అన్ని విధాల సేవలను అందించేందుకు నిర్వాహకులు ప్రత్యేక స్టాల్స్లను అందుబాటులో ఉంచనున్నారు. కల్వరి ఆరాధన మహోత్సవంలో పాల్గొననున్న భక్తులకు దుస్తుల పంపిణీ, భోజన వసతి, వైద్య సదుపాయం, విద్యార్థులకు బ్యాగ్తో కిట్ల పంపిణీ, ప్రాంగణంలో ప్రత్యేక క్లినిక్లను ఏర్పాటు చేయనున్నారు. కల్వరి ఆవరణలో 15 రకాల స్టాల్స్లను ఏర్పాటు చేయనున్నారు.
భద్రత ఏర్పాట్లు..
స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు 2 వేల మంది వలంటీర్లు ట్రాఫిక్ సిబ్బందిని భద్రత అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్, మియాపూర్ మెట్రో డిపో నుంచి కల్వరి మందిరం వరకు ఉచిత బస్సు సర్వీసులతో ఉచిత వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. వృద్ధులు, వికలాంగులతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కల్వరి ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉండనున్నాయి.