కీసర, డిసెంబర్ 21: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు అధ్యాపకులు చదువులో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు అన్ని సిలబస్లను పూర్తి చేసి మళ్లీ విద్యార్థులతో రివిజన్ చేయిస్తున్నారు.ప్రతి పాఠశాల్లో సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా విద్యార్థులను గ్రూపులుగా విభజిస్తున్నారు.కీసర మండలంలోని ఏడు ఉన్నత పాఠశాల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఏడు పాఠశాలల నుంచి మొత్తం 732 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు సమాయత్తం అవుతున్నారు. ప్రత్యేక తరగతుల కోసం ఉదయం, సాయంత్రం ఒక గంట చొప్పున సమయం కేటాయించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మండలంలోని ఏడు పాఠశాలల నుంచి పరీక్షలు రాసే విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాం. కలెక్టర్ హరీశ్, డీఈవో విజయలక్ష్మి ఆదేశానుసారం ఈ సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అధ్యాపకులతో కలిసి శ్రమిస్తున్నాం. విద్యార్థులకు ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి వచ్చిన ఫలితాల ఆధారంగా సబ్జెక్ట్ల వారీగా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
-శశిధర్, మండల విద్యాధికారి