మేడ్చల్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 108 ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులను విద్యాశాఖ కొనసాగిస్తున్నది. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న సమగ్ర మూల్యాంకనం (ఎస్ఏ-వన్) పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రధానంగా 10 వతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు.
జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలలో 108 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో పదోతరగతిలో 8,717 మంది చదువుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల్లోప్రత్యేక తరగతుల ప్రారంభం ఆలస్యంగా కావడంతో సిలబస్ను ఎస్ఏ-వన్ పరీక్షలకు ముందే పూర్తి చేసేందుకు తరగతలను నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి రోజు పదో తరగతి విద్యార్థులకు రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులను నిర్వహించారు. పాఠశాల ప్రారంభ సమయానికి గంట ముందు పాఠశాల పూర్తయిన తర్వాత గంట పాటు తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పరీక్షలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక తరగతులను విద్యాశాఖ కొనసాగిస్తున్నది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. తుది పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రత్యేక తరగతులను కొనసాగించనున్నారు. ఎస్ఏ-వన్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి ఒకటవ తరగతి నుంచి 10 తరగతి వరకు ఆరు రోజుల పాటు విద్యాశాఖ నిర్వహించనుంది.
పదో తరగతి తుది పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రత్యేక తరగతులను కొనసాగిస్తాం. నెల రోజుల నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ ఎస్ఏ-వన్ పరీక్షలకు సంబంధించి సిలబస్ను పూర్తి చేశాం. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. 108 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8,717 మంది విద్యార్థులకు ప్రతి రోజు రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. – ఎన్ఎస్ఎస్ ప్రసాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి