హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): యుద్ధంతో ఎప్పుడు ప్రపంచ మానవాళికి పరాభావమేనని, అణుశక్తి, ఆయుధాలు, కృతిమ మేధ మానవ హననంలో భాగమని.. అందుకే ప్రపంచశాంతి కోసం ప్రతి ఒకరూ కలిసిరావాలని పలువురు కవులు, కళాకారులు, నాయకులు పిలుపునిచ్చారు. ఇరాన్పై.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 29న నిర్వహించనున్న యుద్ధ వ్యతిరేక ర్యాలీకి సంబంధించి తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో యుద్ధం వద్దు అనే అంశంపై కవి, గాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యుద్ద వ్యతిరేక కమిటీ నాయకులు, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ఈటీ నర్సింహ, కవి యాకుబ్, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, ప్రజా నాట్యమండలి ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు శాంతరావు, తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.