సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): వచ్చే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, సరుకు రవాణాకు సంబంధించిన రైళ్ల రాకపోకలు సజావుగా కొనసాగడంపై రైల్వే అధికారులు అనేక రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. రైళ్లు ఢీకొనకుండా ఇప్పటికే సిగ్నల్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. దాదాపు అన్ని రైల్వే మార్గాలలో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయడంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్ట పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాకులు, రోడ్ అండర్ బ్రిడ్జీల పటిష్టతపై దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు అన్ని రకాల చర్యలు మొదలు పెట్టారు. రోడ్ అండర్ బ్రిడ్జీల వ్యవస్థలో వర్షపు నీరు నిల్వకుండా వినూత్న విధానాలు అవలంభిస్తున్నారు. రెండు రకాల ఎత్తైన సబ్వేలను ఏర్పాటు చేయనున్నారు.
అందుకు సంబంధించి ఎస్సీఆర్ జోన్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రైవేటు సైడింగ్ వల్ల వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం కావాల్సిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. శీతాకాలంలో రైళ్ల నిర్వహణ సజావుగా సాగే విధంగా లోకో సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, రైల్వే స్టేషన్లు, సైడింగ్లు, అందుకు సంబంధించిన కార్యాలయాల వల్ల ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నారు. రైళ్ల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్సీఆర్ జోన్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఆరు డివిజనల్ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జోన్ల పరిధిలో కీలకమైన సెక్షన్లలోని పాయింట్లు, క్రాసింగులు, వంతెనల మార్గాలు వంటి ప్రదేశాలలో తప్పకుండా నిరంతరంగా తనిఖీలు నిర్వహించాలన్నారు.