మితిమీరిన హారన్లతో సౌండ్ పొల్యూషన్
కట్టడికి జర్మనీ టెక్నాలజీ సౌండ్ డిటెక్షన్ కెమెరాలు
ఏఎన్పీఆర్తో అనుసంధానమైతే ఓకే
కెమెరాల పనితీరుపై ట్రయల్న్
అది నగరంలోని ఓ చౌరస్తా. నో హాంకింగ్ జోన్. (ఆ ప్రాంతంలో హారన్ మోగించొద్దు) ఓ బైకర్ ముందుగా వెళ్తున్న వాహనాన్ని అలర్ట్ చేసేందుకు హారన్ మోగించారు. వెంటనే అక్కడున్న కెమెరా దాన్ని పసిగట్టింది. ఫలానా వాహనం శబ్దం చేస్తోందని నంబర్ ప్లేట్ సహా రికార్డు చేసింది. వెంటనే సదరు వాహనాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మున్ముందు నగరంలో జరగబోయేది ఇదే. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు జర్మన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్న నగర పోలీసులు.. ఇందుకోసం ట్రయల్ రన్ పూర్తి చేశారు. 20 మీటర్ల దూరంలో ఉండే వాహనాలను సైతం గుర్తించే అత్యాధునిక కెమెరాలను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ వ్యవస్థకు అనుసంధానం చేయనున్నారు. తొలి విడుతగా ఒక చౌరస్తాలో దీన్ని పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వాహనాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఇందులో వ్యక్తిగత, రవాణాతోపాటు ఇతర వాహనాల సంఖ్య అధికంగా ఉంటున్నది. పెరుగుతున్న వాహనాలకు తగినట్లు శబ్ద కాలుష్యం మీతిమీరుతున్నది. కొందరు అవసరం లేకున్నా హారన్లు మోగిస్తూ ఆరోగ్యానికి హాని చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగరాన్ని శబ్దకాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు ముమ్మరం చేశారు. జర్మనీ టెక్నాలజీతో తయారు చేసిన కెమెరాల పనితీరును బుధవారం ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ బృందం పరిశీలించింది. దేశంలోనే తొలిసారి హైదరాబాద్లోనే ట్రాఫిక్ విభాగంలో ఈ టెక్నాలజీకి సంబంధించిన ట్రయల్న్ నిర్వహించారు. ఆధునిక టెక్నాలజీ కలిగిన ఈ కెమెరాల పనితీరును ఆ సంస్థ (ఏసీవోఈఎం) ప్రతినిధులు ట్రాఫిక్ పోలీసులకు వివరించారు. నాంపల్లి ట్రాఫిక్ కంట్రోల్ రూం సమీపంలోని సిగ్నల్స్ వద్ద వాహనాలను రికార్డు చేసి కెమెరాల పనితీరును సంస్థ ప్రతినిధులు వివరించారు.
20 మీటర్ల దూరంలో..
ఒక చౌరస్తాలో ఎక్కువ శబ్దంతో హారన్ కొట్టే వాహనాలను ఈ కెమెరాలు గుర్తిస్తాయి. ఫలాన వాహనం నుంచి అధిక సౌండ్ వస్తుందని సూచన చేస్తుంది. చౌరస్తాలో 20 మీటర్ల దూరంలో ఉండే వాహనాలను ఈ కెమెరాలు గుర్తిస్తాయి. ఒక్కో కెమెరా విలువ రూ. 12 లక్షల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఏఎన్పీఆర్తో అనుసంధానం
కెమెరాల పనితీరును జాయింట్ సీపీ రంగనాథ్, డీసీపీలు ప్రకాశ్రెడ్డి, కరుణాకర్, ఐటీసెల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు, అడ్మిన్ ఇన్స్పెక్టర్ రాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలించారు. కెమెరాలు పనిచేసే విధానాన్ని తెలుసుకున్న జాయింట్ సీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ విభాగానికి అవసరమయ్యే విధంగా సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఒక చౌరస్తాలో హారన్ ఏ వాహనం నుంచి వస్తుందనే విషయాన్ని ఈ కెమెరాలు గుర్తిస్తున్నాయని, అదే విధంగా ఆ వాహనం నంబర్ ప్లేట్ను కూడా రికార్డు చేయాలని సూచించారు.
అవగాహన కల్పిస్తాం
హైదరాబాద్ను హారన్ ఫ్రీ సిటీగా మార్చేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా మొదట కొన్ని చౌరస్తాలను ‘నో హాంకింగ్’ జోన్లుగా మారుస్తాం. ఆ చౌరస్తాల్లో కెమెరాలను ఏర్పాటు చేస్తాం. అక్కడ హారన్ కొట్టవద్దని వాహనదారులకు అవగాహన కల్పిస్తాం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఏర్పాటు చేసే కెమెరాలతో నిఘాను పటిష్టం చేస్తాం. ప్రస్తుతం జర్మనీ టెక్నాలజీతో ఉన్న కెమెరాలు, మన వద్ద ఉన్న ఏఎన్పీఆర్ కెమెరాలతో అనుసంధానమవుతుందా? అనే విషయాన్ని పరిశీలించేందుకు ట్రాఫిక్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్కు బాధ్యత అప్పగించాం. – ట్రాఫిక్ జాయింట్ సీపీ, రంగనాథ్