సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ)/మైలార్దేవపల్లి: గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన రహదారుల వెంట నాలుగు నుంచి ఆరు వరుసల్లో నాటుతున్న మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్గా వ్యవహరించే ఈ విధానం ద్వారా రహదారులకు ఇరువైపులా అధిక విస్తీర్ణంలో స్థలం పూల మొక్కలను విరివిగా నాటనున్నారు. తీగ జాతి మొక్కలు కాగితం పూలు, పూల పొదల మొక్కలు మొదటి వరుసలో, ఒక అడుగు వర కు ఎదిగే పొగడ, బిజ్జోనియా మెగాఫోటమికా జాతి మొక్కలు, చివరి వరుసల్లో ఏపుగా పెరిగి నీడ నిచ్చే వేప, రావి, మర్రి తదితర చెట్లను నాటుతారు. ఈ విధానంతో ముందుగా కనువిందు చేసే పూల మొక్క లు, రెండు మూడు ఫీట్లు దట్టంగా పెరిగే మొక్కలు, చివరగా ఏపుగా పెరిగే చెట్ల ద్వారా ఆయా మార్గాల్లో వెళ్లే ఈ మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ కనువిందు చేస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచనల మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ విధమైన ప్ల్లాంటేషన్ను జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తు న చేపట్టింది. ఇప్పటికే మియాపూర్ బస్డిపో, బీకే ఎన్క్లేవ్ రోడ్, రాందేవ్ గూడ నుంచి నెక్నాంపూర్ రోడ్, మల్కాజిగిరి సర్కిల్లోని జెడ్టీసీ నుంచి ఎన్ఎఫ్సీ వరకు ఈ ప్ల్లాంటేషన్ను చేపడుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వరకు ఉన్న దాదాపు రెండున్నర కిలో మీటర్ల దూరంలో రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ను చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మహాగని మొక్కను నాటారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అర్బన్ బయో డైవర్శిటీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ ఆశోక్ సామ్రాట్లతో కలిసి పరిశీలించిన సోమేశ్ కుమార్ ఈ ప్లాంటేషన్పై సంతృప్తి వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆరాంఘర్ వరకు పూర్తి స్థాయిలో మల్టీ లెవల్ ప్లాంటేషన్ను చేపట్టాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. ఎయిర్పోర్టు నుంచి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో నగరంలో ప్రవేశించే విధంగా గ్రీనరీని పెంపొందించాలని సూచించారు. ప్రధాన రహదారిలో మధ్యలో ఉన్న రోడ్ డివైడర్లలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ వివరాలు, మొక్కల జాతుల వివరాలను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఈ మల్టీ లెవల్ ప్లాంటేషన్ చేపట్టేందుకు అనువుగా ఉన్న రహదారులలో చేపడుతున్నామని కమిషనర్ లోకేశ్ కుమార్ వివరించారు.