బడంగ్పేట, మే 9 : అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని మాజీ స్వీకర్ మధుసూదన చారి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం విశ్వకర్మ మన్మయ సంఘం ప్రెసిడెంట్ క్రిష్ణమాచారి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస చారి ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా నిర్వహించిన సమావేశానికి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ పెడరేషన్ అధ్యక్షుడు ధాన కర్ణాచారి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు.
విశ్వకర్మ మన్మయ సంఘం సభ్యులందరు కాసానికి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు న్యాయం జరిగిందంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లనే అన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులకు జీవం పోసింది కేసీఆర్ అన్నారు. ఇచ్చిన గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని తెలిపారు. బీజేపీకి ఓట్లు వేస్తే అంతా ప్రైవేట్ పరం చేస్తారని, సంపన్న వర్గాలకు బీజేపీ దేశ సంపదను దార దత్తం చేయబోతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో కరెంటు అదో గతి అయ్యిందని తెలిపారు. బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోటేశ్ చారి, రమాచారి, వెంకటాచారి, కార్పొరేటర్లు భూపాల్రెడ్డి, రాజేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.