ఖైరతాబాద్, ఆగస్టు 19: సోలార్ ఎనర్జీపై ప్రజలకు విస్తృతం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్ కుమార్ తెలిపారు. సోమాజిగూడలోని అసోసియేషన్ కార్యాలయంలో గురువారం నూతన కార్యవర్గాన్ని ప్రధాన కార్యదర్శి హరిబాబు, కోశాధికారిగా అనిల్ కుమార్తో కలిసి ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన ఉపాధ్యక్షుడిగా పరకాల రాజేశ్, తోట ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా బాబు నాయుడు, కె. శ్రీనివాస్, సంయుక్త కోశాధికారిగా జగదీశ్, కార్యవర్గ సభ్యులుగా రాధిక, సురేందర్ర, బద్రీనాథ్, జాన్, శ్రీనివాస్లు ఎన్నికయ్యారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఈ రంగం కొంత వెనుకబడిందని, తిరిగి పుంజుకుంటుందన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని సోలార్ విద్యుత్ ఉత్పత్తి వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 25 మెగా వాట్ల సోలార్ సబ్సిడీ పథకాన్ని ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇది అమలవుతుందన్నారు. ఒక కిలోవాట్ ఉత్పత్తికి 100 చదరపు అడుగులు అవసరం ఉంటుందని, ఖర్చు ప్రభుత్వం నిర్ణయించే ధరల ప్రకారమే ఉంటుందన్నారు.